ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రత, మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య అధికారులను ఆదేశించారు.
గురువారం మెండోరా మండలంలోని పోచంపాడు (శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్) వద్ద ఉన్న పుష్కర ఘాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఘాట్ల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, వాకింగ్ ట్రాక్ల ఏర్పాటు గురించి సంబంధిత అధికారులతో చర్చించారు.
పుష్కరాల సమయంలో సురక్షితమైన రాకపోకలకు అనువైన మార్గాలను సిద్ధం చేయాలని సూచించారు. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, నిరంతర సీసీ కెమెరాల నిఘా, తాత్కాలిక పోలీస్ సహాయ కేంద్రాలు, వైద్య శిబిరాలు, తాగునీరు, పారిశుద్ధ్య చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ, పుష్కరాలను విజయవంతం చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, మెండోరా ఎస్సై సుహాసిని, ఇరిగేషన్ శాఖ డీఈ సురేష్, ఏఈలు సుశాంత్ కుమార్, వంశీ, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.
