విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన నలుగురు నిందితులకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ నిజామాబాద్ మూడవ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి (ఫ్యామిలీ కోర్టు) డి. దుర్గా ప్రసాద్ బుధవారం తీర్పునిచ్చారు.
కేసు వివరాల్లోకి వెళ్తే… గతేడాది జూన్ 22, 23 తేదీల అర్ధరాత్రి సమయంలో మోర్తాడ్ పోలీసు స్టేషన్ పరిధిలోని డొంకల్ గ్రామ సమీపంలో కానిస్టేబుళ్లు తోపారపు వినయ్, షౌకత్ అలీ క్రైమ్ బీట్ డ్యూటీ నిర్వహిస్తున్నారు.
ఆ సమయంలో రాజస్థాన్ డాబా వద్ద అనుమానాస్పదంగా ఉన్న దాల్మల్కా భూపతి, నూతికట్టు శివకుమార్, నూతికట్టు శ్రీవర్ధన్, తోపరం శశిశేఖర్లను పోలీసులు ప్రశ్నించారు.దీనిపై ఆగ్రహించిన నిందితులు.. “మీరు పోలీసులైతే మాకేంటి” అంటూ పోలీసులను దుర్భాషలాడారు.
ఆ తర్వాత కానిస్టేబుల్ షౌకత్ అలీ రెయిన్కోట్ను చింపివేసి, ఇద్దరు కానిస్టేబుళ్లను కిందకు తోసేశారు. అంతటితో ఆగకుండా బండరాయిని తీసుకుని వారిపై దాడికి ప్రయత్నించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, శాస్త్రీయంగా దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు.
విచారణలో నేరం రుజువు కావడంతో నిందితులకు శిక్ష ఖరారు చేస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ విషయాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య వెల్లడించారు. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
