8 మందిపై కేసు నమోదు.. ఇద్దరి రిమాండ్ నగరంలో నకిలీ కరెన్సీని చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను నిజామాబాద్ 5వ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
నగరంలోని నాగరం చౌరస్తా వద్ద బుధవారం పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టయింది.5వ టౌన్ ఎస్హెచ్ఓ సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ద్విచక్ర వాహనంపై వస్తున్న షేక్ కైజర్, రమేష్ గౌడ్లను అదుపులోకి తీసుకుని సోదాలు చేపట్టారు.
నిందితుడు షేక్ కైజర్ వద్ద రూ. 500 ముఖచిత్రం కలిగిన నకిలీ నోట్లు (200 నోట్లు), రూ. 1,65,000 అసలైన నగదు, 5 మొబైల్ ఫోన్లు, రబ్బర్ బాండ్లు, కవర్లు, ఒక మోటార్ సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు రమేష్ గౌడ్ వద్ద రెండు సెల్ఫోన్లు, రూ. 5,000 నగదుతో పాటు ఖాళీ సిమ్ కార్డు పౌచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దందాలో వీరితో పాటు మరికొందరికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, మొత్తం 8 మందిపై కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితులుగా ఉన్న కైజర్, రమేష్ గౌడ్లను అదుపులోకి తీసుకుని విచారించగా, నకిలీ కరెన్సీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితులను విచారించిన అనంతరం బుధవారం రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
నకిలీ నోట్ల ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఎస్హెచ్ఓ సునీల్ కోరారు.
