HomeTelanganaNizamabadనిరంతర సేవా యజ్ఞం..1900 రోజులకు చేరిన 'ఇందూరు యువత' అన్నదానం

నిరంతర సేవా యజ్ఞం..1900 రోజులకు చేరిన ‘ఇందూరు యువత’ అన్నదానం

ఆకలితో ఉన్నవారికి అండగా నిలవాలన్న ఆశయంతో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ చేపట్టిన మహోన్నత సేవ నిరంతరంగా కొనసాగుతోంది. నిత్య అన్నదాన ప్రస్థానంలో ఈ సంస్థ తాజాగా మరో అరుదైన మైలురాయిని అధిగమించింది.

ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతిరోజూ కొనసాగుతున్న ఈ అన్నదాన కార్యక్రమం నేటితో దిగ్విజయంగా 1900 రోజులు పూర్తి చేసుకుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో ప్రత్యేక అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

నగరంలోని ప్రధాన వీధులు, బస్టాండ్ ప్రాంతాలు, రైల్వే స్టేషన్ పరిసరాల్లో రోడ్లపై నివసించే అనాథలు, అభాగ్యులు, నిరాశ్రయులు మరియు విధివంచితులను ప్రేమతో ఆప్యాయంగా పలకరించి వారికి రుచికరమైన భోజనాన్ని అందించారు.

“సేవకు మించిన దైవం లేదు” అన్న నినాదంతో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అడుగులు వేస్తోంది. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో ప్రారంభమైన ఈ ప్రయాణం… ఎండనక, వాననక, పండుగలు-పబ్బాలు అనే తేడా లేకుండా గత 1900 రోజులుగా అవిశ్రాంతంగా సాగుతూనే ఉంది.

ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆర్థిక, భౌతిక సవాళ్లు ఎదురైనప్పటికీ, దాతల సహకారం మరియు సభ్యుల అంకితభావంతో సంస్థ వెనకడుగు వేయకుండా తన లక్ష్యం వైపు ముందుకు సాగుతోంది. ఈ 1900 రోజుల సేవా ప్రయాణం కేవలం ఒక సంఖ్య కాదు… అవసరంలో ఉన్నవారి ఆకలిని తీర్చాలనే మానవతా విలువలకు ప్రతీకగా నిలిచిన ఒక నిరంతర సేవా యజ్ఞం.

సమాజంలోని నిస్సహాయుల కడుపు నింపుతున్న ఈ సంతృప్తి మమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తోంది. భవిష్యత్తులో కూడా ఇదే సేవాభావంతో, మరింత అంకితభావంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామనీ వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిబాబు అన్నారు.

నిస్వార్థ సేవే ఊపిరిగా సాగుతున్న ఈ అన్నదాన యజ్ఞాన్ని చూసి స్థానిక ప్రజలు, మేధావులు సంస్థ నిర్వాహకులను, సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మరియు పలువురు స్వచ్ఛంద సేవా కార్యకర్తలు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments