ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడంతోపాటు నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో నిజామాబాద్ త్రీటౌన్ పోలీసుల ఆధ్వర్యంలో గౌతమ్నగర్లో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు.
సీపీ ఆదేశాల మేరకు ఏసీపీ పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో కాలనీ ప్రజలతో పోలీసులు సమావేశమై భద్రత, నేరాల నివారణ, సైబర్ మోసాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజలు తమ సమస్యలను ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు, వారి కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఇంటి యజమానులు తమ ఇళ్లలో నివసించే కిరాయిదారుల వివరాలను పోలీసులకు అందుబాటులో ఉంచాలని, కొత్తగా వచ్చే వ్యక్తుల వివరాలను తెలియజేయాలని సూచించారు.
బీట్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయడంలో ప్రజలు సహకరించాలని కోరారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాల నియంత్రణకు సహకరించాలని పోలీసులు సూచించారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, యువత భద్రతకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు.
మహిళలు అవసరమైనప్పుడు ఉమెన్ హెల్ప్డెస్క్, షీ టీమ్స్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. పిల్లల రక్షణ, పోక్సో చట్టంపై తల్లిదండ్రులకు వివరించారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఓటీపీ, యూపీఐ, బ్యాంకింగ్ లావాదేవీల పేరుతో జరిగే సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులకు ఓటీపీ, బ్యాంకు వివరాలు వెల్లడించవద్దని సూచించారు.
హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని, డ్రంక్ డ్రైవింగ్కు దూరంగా ఉండాలని తెలిపారు. ఒంటరిగా నివసించే వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజలు తెలిపిన సమస్యలు, ఫిర్యాదులను నమోదు చేసుకుని, వాటి పరిష్కారానికి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు భరోసా ఇచ్చారు.
ప్రజలు–పోలీసుల మధ్య సత్సంబంధాలు పెంపొందించడం, పరస్పర నమ్మకాన్ని బలోపేతం చేయడం ద్వారా నేరాల నివారణకు ప్రజల సహకారం పొందడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.
