వ్యవసాయ మోటార్ మరమ్మతు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై తండ్రి, కుమారుడు మృతి చెందిన విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో చోటుచేసుకుంది.
కాటారం మండలం గంగారం గ్రామం మార్వాడీపల్లికి చెందిన కట్టెకోల బాపు, ఆయన కుమారుడు కట్టెకోల మహేష్ గురువారం సాయంత్రం కొండంపేట శివారులోని రోడ్ డ్యాం సమీపంలో తమ వ్యవసాయ పొలం వద్ద మోటార్ సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యారు.
తీవ్ర విద్యుత్ షాక్కు గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.అయితే ఈ విషయం శుక్రవారం ఉదయం వరకు కుటుంబ సభ్యులకు తెలియలేదు. పొలం వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు తండ్రి, కుమారుడు మృతి చెంది ఉండటాన్ని గుర్తించి కొయ్యూరు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఒకేసారి తండ్రి, కుమారుడు మృతి చెందడంతో మార్వాడీపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
