రైతుల్లో హర్షంపసుపు ధర పసుపు రైతుల్లో కొత్త ఆశలు నింపుతోంది. నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధర రికార్డు స్థాయికి చేరింది. గురువారం ఆర్మూర్ మండలం చేఫూర్కు చెందిన రైతు నడ్కుడ శ్రీను తీసుకొచ్చిన పసుపు క్వింటాల్కు గరిష్ఠంగా రూ.23,807 ధర పలికింది.
దీంతో ఇప్పటివరకు ఉన్న రికార్డులను అధిగమించి పసుపు ధర తొలిసారిగా రూ.20 వేల మార్కును దాటింది.గత సీజన్లో గరిష్ఠంగా రూ.15,566 ధర మాత్రమే పలికింది. ఈసారి మాత్రం గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగింది.తాజాగా రూ.23,807 ధర నమోదవడంతో ఏళ్లుగా ఉన్న రికార్డు బద్దలైంది.
మార్కెట్లో పసుపు ధర నెల రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ సీజన్ ప్రారంభంలో క్వింటాల్కు సగటు ధర రూ.9 వేల నుంచి రూ.13 వేల వరకు ఉండగా.. ఈ ఏడాది ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల పసుపు కలిపి సగటు ధర సుమారు రూ.16 వేల వరకు ఉంది.
గోళ రకం పసుపునకు గురువారం గరిష్ఠంగా రూ.15,000, కనిష్ఠంగా రూ.10 వేల ధర లభించింది. సగటు ధర రూ.13 వేలుగా నమోదైంది. నాణ్యతను బట్టి ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది.
ఈ ఏడాది దాదాపు 7 లక్షల క్వింటాళ్ల పసుపు దిగుబడి వచ్చినట్లు అంచనా. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో పసుపును పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి పంట నిజామాబాద్ మార్కెట్కు తరలివస్తోంది. డిమాండ్ పెరగడంతో ధరలు క్రమంగా పైకి ఎగబాకుతున్నాయి.
అర్వింద్ అంచనా నిజం ఈ సీజన్లో పసుపు ధర రూ.20 వేల మార్కును దాటుతుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు.
తాజాగా నిజామాబాద్ మార్కెట్లో క్వింటాల్ పసుపు రూ.23 వేలకుపైగా పలకడంతో ఆయన అంచనా నిజమైందని రైతులు పేర్కొంటున్నారు. రికార్డు ధరతో పసుపు సాగు చేసిన రైతుల్లో ఉత్సాహం నెలకొంది. మరికొంతకాలం ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే తమకు మరింత లాభం చేకూరుతుందని రైతులు ఆశిస్తున్నారు.
