తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధికి ఎన్నారైలు బలమైన మద్దతుదారులు, రాయబారులుగా నిలవాలని కోరారు.
లండన్ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్బాబుతో కలిసి సీఎం రేవంత్రెడ్డి ప్రవాస భారతీయులు, తెలుగు కమ్యూనిటీ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొన్నారు.సెంట్రల్ లండన్లోని తాజ్ హోటల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ పీసీసీ ఎన్నారై కన్వీనర్ సుధాకర్గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
యూకేలోని తెలుగు, తెలంగాణ కమ్యూనిటీ నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు, ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.తెలంగాణ అభివృద్ధి, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రవాస తెలంగాణ సమాజంతో ప్రభుత్వ అనుసంధానం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై సీఎం రేవంత్రెడ్డి ప్రవాసులతో నేరుగా చర్చించారు. రాష్ట్ర ప్రగతికి ప్రవాసుల అనుభవం, నైపుణ్యం, పెట్టుబడులు, ఆలోచనలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. విదేశాల్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న తెలంగాణ నిపుణులు తమ జ్ఞానం, అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధికి అందించాలని సీఎం కోరారు.
ప్రవాస తెలంగాణ సమాజం మధ్య సమన్వయం, నెట్వర్క్ను మరింత బలోపేతం చేసి తెలంగాణలో కొత్త అవకాశాలను సృష్టించేందుకు కలిసి పనిచేయాలని సూచించారు.‘తెలంగాణ రైజింగ్’లో ప్రవాస భారతీయులు చురుకైన భాగస్వాములు కావాలని రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక, ఆవిష్కరణల శక్తి కేంద్రంగా తెలంగాణ ఎదిగే ప్రయాణంలో ఎన్నారైలు కీలక పాత్ర పోషించాలని అన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో రాయబారులుగా వ్యవహరించాలని కోరారు.రాష్ట్రానికి ఉపయోగపడే కొత్త ఆలోచనలు, సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఎన్నారైలు, పెట్టుబడిదారులు, నిపుణులను సీఎం కోరారు.కార్యక్రమంలో పెట్టుబడులు, విద్యారంగం, ఎన్నారైలతో తెలంగాణ ప్రభుత్వ అనుసంధానం ప్రధానంగా చర్చకు వచ్చాయి.
యూకే, యూరప్లోని పెట్టుబడిదారులను తెలంగాణలో పెట్టుబడులకు ఆకర్షించేలా అనుకూల వాతావరణం కల్పించడం, విద్యారంగంలో అంతర్జాతీయ అనుభవాన్ని రాష్ట్రానికి అనుసంధానం చేయడం వంటి అంశాలపై చర్చ జరిగింది.విదేశాల్లోని తెలంగాణ నిపుణుల సేవలను రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకోవాల్సిన అవసరాన్ని పలువురు ప్రస్తావించారు. పెట్టుబడులు, విద్య, నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణకు అనుసంధానం చేయడం ద్వారా మరిన్ని అవకాశాలు సృష్టించవచ్చని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కార్యక్రమ నిర్వాహకుడు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ పీసీసీ ఎన్నారై కన్వీనర్ సుధాకర్గౌడ్ మాట్లాడుతూ.. యూకేలోని తెలంగాణ సమాజం, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు రాష్ట్ర ప్రభుత్వంతో మరింత సమన్వయంతో పనిచేసేలా ప్రత్యేక వ్యవస్థ అవసరమని కోరారు.యూకేలో ఉన్న పెట్టుబడులు, విద్యా అవకాశాలు, ఎన్నారైల అవసరాలకు తెలంగాణ ప్రభుత్వంతో నేరుగా అనుసంధానం కల్పించేలా బలమైన వారధి ఉండాలని సూచించారు.
ఈ ప్రతిపాదనపై సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు సానుకూలంగా స్పందించినట్లు సుధాకర్గౌడ్ తెలిపారు. డిసెంబర్లో నిర్వహించనున్న తదుపరి గ్లోబల్ సమ్మిట్ బిజినెస్ మీట్కు యూకేలోని పెట్టుబడిదారులు, నిపుణులను ఆహ్వానిస్తామని సీఎం, మంత్రి వెల్లడించినట్లు సుధాకర్గౌడ్ తెలిపారు.. కార్యక్రమంలో విద్యారంగంపై ప్రత్యేక ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణలో విద్యా ప్రమాణాలను మరింత పెంచడం, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడంపై సీఎం రేవంత్రెడ్డి ఎన్నారైలు, విద్యావేత్తలతో సుదీర్ఘంగా చర్చించారు. విదేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ నిపుణుల అనుభవం, జ్ఞానం, ఆలోచనలను రాష్ట్ర విద్యా వ్యవస్థ, అభివృద్ధి కార్యక్రమాలకు అనుసంధానం చేయాలని పలువురు సూచించారు.
ప్రభుత్వం, ప్రవాస తెలంగాణ సమాజం మధ్య మరింత సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. సుధాకర్గౌడ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డికి లండన్తో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. గతంలో లండన్ పర్యటన సందర్భంగా గల్ఫ్ ఎన్నారైలకు ఇచ్చిన హామీని నెరవేర్చిన విషయాన్ని ప్రస్తావించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్రెడ్డి ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నారు. సీఎంకు లండన్తో పాటు యూకేలోని ప్రవాస భారతీయులు, తెలంగాణ సమాజంలో అభిమానులు, కార్యకర్తల మద్దతు ఉందన్నారు.
రేవంత్రెడ్డిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆయనకు అండగా నిలిచే అభిమానులు, కార్యకర్తలు ఉన్నారని పేర్కొన్నారు. ‘లెట్స్ యునైట్.. లెట్స్ ఎంగేజ్.. లెట్స్ బిల్డ్ ఏ బెటర్ తెలంగాణ’ నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రవాస తెలంగాణ సమాజంలో నూతన ఉత్సాహాన్ని నింపింది.
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడం, విదేశాల్లోని నిపుణుల అనుభవాన్ని రాష్ట్ర ప్రగతికి వినియోగించడం, విద్యారంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం చేయడం, ప్రభుత్వంతో ప్రవాస సమాజానికి మరింత బలమైన అనుసంధానం కల్పించడం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
సుధాకర్గౌడ్ నాయకత్వంలో జరిగిన లండన్ ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం, ప్రవాస తెలంగాణ సమాజం మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే వేదికగా నిలిచింది. పెట్టుబడులు, విద్య, నైపుణ్యం, అంతర్జాతీయ అనుభవాలను తెలంగాణ అభివృద్ధితో అనుసంధానం చేయడంలో ప్రవాసుల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా సమావేశం సాగింది.
