ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందిఆరు డీఏలు వెంటనే విడుదల చేయాలి.. రెండో పీఆర్సీ అమలు చేయాలిసీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలి.. పెండింగ్ బిల్లులకు నెలకు రూ.2 వేల కోట్లు చెల్లించాలినిజామాబాద్లో టీజీఈజేఏసీ మహాధర్నా.. భారీగా తరలివచ్చిన ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులుఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఆరోపిస్తూ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కదం తొక్కారు.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ గురువారం నిజామాబాద్ ధర్నాచౌక్లో భారీ మహాధర్నా నిర్వహించారు.
జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ధర్నాచౌక్ ఉద్యోగుల నినాదాలతో మార్మోగింది.
ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆరు పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ప్రతినెలా రూ.2 వేల కోట్లు కేటాయించాలని కోరారు.
జీతభత్యాలకు సంబంధించిన బకాయిలను పెండింగ్లో ఉంచడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సీపీఎస్ రద్దు.. ఓపీఎస్ అమలు చేయాలిఉద్యోగుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని టీజీఈజేఏసీ డిమాండ్ చేసింది.
పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం.. పెన్షన్ విషయంలో అనిశ్చితి నెలకొల్పడం సరికాదని నాయకులు పేర్కొన్నారు.
ఉద్యోగుల జీవితకాల సేవలకు తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. డీఏలు, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, ఓపీఎస్ వంటి అంశాలపై ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నాయకులు మండిపడ్డారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా మాటలతో కాలం వెళ్లదీయడం ఇక సాధ్యం కాదన్నారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సహనాన్ని ప్రభుత్వం పరీక్షించవద్దని హెచ్చరించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మహాధర్నాలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని టీజీఈజేఏసీ నాయకులు హెచ్చరించారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడుతామని స్పష్టం చేశారు.
