పోలీసు శాఖలో ఒత్తిడితో కూడిన విధులు నిర్వర్తిస్తూ ఎలాంటి రిమార్కులు లేకుండా సర్వీసును పూర్తి చేసి పదవీ విరమణ పొందడం అభినందనీయమని పోలీసు కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది అందించిన సేవలు శాఖకు ఎంతో విలువైనవని పేర్కొన్నారు.
పోలీసు శాఖలో ఆగస్టు నెలలో పదవీ విరమణ పొందిన సిబ్బందికి సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. టౌన్-3 పోలీస్స్టేషన్ అటాచ్డ్ స్పెషల్ బ్రాంచ్లో ఏఎస్ఐగా పనిచేసిన కె.గంగాధర్గౌడ్ 36 ఏళ్ల సర్వీసును పూర్తి చేశారు.
ఏఆర్ హెడ్క్వార్టర్స్లో ఆర్ఎస్ఐగా పనిచేసిన అమీరుద్దీన్ 38 ఏళ్ల సర్వీసు పూర్తి చేయగా.. ఏఆర్ కానిస్టేబుల్ పనిచేసిన కె.అశోక్ 41 ఏళ్ల సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొందారు.
ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన సిబ్బందిని సీపీ సాయి చైతన్య శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు, పదవీ విరమణ శుభాకాంక్షల సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ పదవీ విరమణ తప్పనిసరి అని, అయితే పోలీసు శాఖలో తీవ్ర ఒత్తిడితో కూడిన విధులు నిర్వర్తించి ఎలాంటి రిమార్కులు లేకుండా సేవలను పూర్తి చేయడం గొప్ప విషయమని అన్నారు.
పదవీ విరమణ అనంతరం కూడా ఏదైనా అవసరం ఉంటే పోలీసు శాఖ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో ఏఆర్ హెడ్క్వార్టర్స్ ఏసీపీ శ్రీరాములు, ఆఫీస్ సూపరింటెండెంట్లు ఎ.జగతి, టి.వనమాల, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ (ఎంటీవో) ఎస్.శేఖర్బాబు, వెల్ఫేర్/హోంగార్డ్స్ విభాగం సతీష్తో పాటు పదవీ విరమణ చేసిన సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
