జిల్లా మార్చురీలో ఫ్రిజర్లు లేవని ఎత్తిచూపిన ఎమ్మెల్యే ధన్పాల్ఏడాదిగా ఇదే దుస్థితి.. సమీక్షలు, సమావేశాలతో సరిపెడుతున్నారంటూ ఆగ్రహంనిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వెనుకనున్న మార్చురీ దుస్థితిపై ‘ఇది సంగతి’ పత్రికలో ప్రచురించిన వరుస కథనాలు అసెంబ్లీ వరకు వెళ్లాయి.
మార్చురీలో మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రిజర్లు లేకపోవడం, మృతదేహాల నుంచి వెలువడే దుర్వాసన ఆసుపత్రి జనరల్ వార్డుల వరకు వ్యాపిస్తున్న విషయాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శుక్రవారం శాసనసభలో ప్రస్తావించారు.
పత్రికల్లో కథనాలు వచ్చినా.. సమీక్షలు జరిగినా.. పరిస్థితి మాత్రం మారలేదని ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకెళ్లారు. ఏడాది క్రితం వైద్యశాఖ మంత్రి ఆసుపత్రికి వచ్చి సమీక్ష నిర్వహించారని, రెండు నెలల క్రితం ఎమ్మెల్యేలతో సమావేశం కూడా జరిగిందని తెలిపారు.
అయినప్పటికీ మార్చురీలో మృతదేహాలను భద్రపరిచే కనీస సౌకర్యాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. మృతదేహాలు ఎక్కువసేపు భద్రపరచాల్సిన పరిస్థితుల్లో ఫ్రిజర్లు లేకపోవడంతో దుర్వాసన వ్యాపించి రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
*జిల్లాకు ప్రత్యేక నిధులేవీ?* కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక నిధుల కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ధన్పాల్ విమర్శించారు. జిల్లాలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
*యంగ్ ఇండియా’కు లేఖలు.. అయినా స్పందన లేదు* నిజామాబాద్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రికి మూడు సార్లు లేఖలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కళాభారతికి సంబంధించిన బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయని సభ దృష్టికి తీసుకెళ్లారు.
మాధవనగర్ వంతెనకు సంబంధించిన నిధుల అంశాన్ని కూడా ప్రస్తావించారు.
*బస్టాండ్ తీరు మార్చాలి* వరంగల్ తర్వాత రాష్ట్రంలో పెద్ద బస్టాండ్లలో నిజామాబాద్ బస్టాండు ఒకటని పేర్కొన్న ఎమ్మెల్యే.. ప్రస్తుతం దాని పరిస్థితి చూస్తే జిల్లా స్థాయి బస్టాండుకు కాకుండా మండల స్థాయి బస్టాండుకు సమానంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్టాండు అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
