ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ కార్యాలయంలో కొలువుదీరిన సేవా గణపతి వద్ద శుక్రవారం సామూహిక కుంకుమార్చనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
సుమంగళులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనతో గణనాథుడిని కొలిచారు.కుటుంబాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సౌభాగ్యం, సకల శుభాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమార్చనతో పాటు సేవా గణపతికి గరిక పూజను ఘనంగా నిర్వహించారు.
మంగళద్రవ్యాలతో ప్రత్యేక పూజలు చేయడంతో ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.మహిళల సామూహిక భాగస్వామ్యంతో పూజా కార్యక్రమాలు భక్తిమయ వాతావరణంలో సాగాయి.
అనంతరం గణపతికి సమర్పించిన తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబుతో పాటు కార్యవర్గ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
