బియ్యం వ్యాపారం చేద్దామని నమ్మబలికారు.. తీరా కలిశాక మత్తులో ముంచారు.. ఒంటిపై ఉన్న బంగారం, జేబులో ఉన్న నగదుతో పరారయ్యారు. నిజామాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన ఈ దోపిడీ ఉదంతాన్ని నాలుగవ టౌన్ పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్హెచ్ఓ సతీశ్ కుమార్ తెలిపారు.
బుధవారం స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. బాధిత శ్రీనివాస్కు నిందితులు బాత ప్రసాదం, నర్సింగారావు, రుద్రా యాదవ లు రైస్ బిజినెస్ పేరుతో ఆశ చూపి గత నెల 17న నగరంలోని ‘వంశీ ఇంటర్నేషనల్ హోటల్’లో చర్చలకని పిలిచారు.
మాటల మధ్యలో శ్రీనివాస్ తాగే బీరులో ఎవరికీ తెలియకుండా మత్తు గోళీలు కలిపారు. అది తాగిన కొద్దిసేపటికే ఆయన మత్తులోకి జారుకోగా, నిందితులు తమ అసలు రూపం బయటపెట్టారు. బాధితుడి నుంచి రెండు బంగారు ఉంగరాలు, గోల్డ్ చైన్, కొంత నగదు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారనీ తెలిపారు.
దీంతో బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎస్సైలు ఉదయ్ కుమార్, సందీప్ కుమార్ సాంకేతిక ఆధారాలతో ఎట్టకేలకు నిందితులను పట్టుకొని అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నారని తెలిపారు.
అలాగే దొంగిలించిన సొమ్మును హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ గుప్తా వద్ద తాకట్టు పెట్టినట్లు నిందితులు ఒప్పుకున్నారనీ తెలిపారు. వీరు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గతంలోనూ పలు నేరాలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయన్నారు.
కేసును వేగంగా ఛేదించిన ఏఎస్ఐ రవీందర్, కానిస్టేబుళ్లు శేఖర్, రమేష్, సనగేష్లను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.
అప్రమత్తంగా ఉండండి!
సతీష్ కుమార్,ఎస్హెచ్ఓ టౌన్ ఫోర్..
అపరిచిత వ్యక్తులతో వ్యాపార లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వారు ఇచ్చే తినుబండారాలు, పానీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించవద్దు. మోసపోయామని తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులను ఆశ్రయించాలి.
