రాష్ట్రంలో రేషనలైజేషన్ పేరుతో 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఇది పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడమేనని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది.
ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఏబీవీపీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్ను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు పలుచోట్ల ఆందోళనలు చేపట్టగా, వారిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
నిజామాబాద్ జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వీనర్ అక్షయ్ మాట్లాడుతూ.. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఆర్థిక దోపిడీకి ప్రభుత్వం కొమ్ముకాస్తోందని విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా సాగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టేలా ‘ఫీజు నియంత్రణ చట్టాన్ని’ వెంటనే తీసుకురావాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలి. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈఓ పోస్టులతో పాటు టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.
ఒకే అనుమతితో బహుళ బ్రాంచీలను నడుపుతూ, వ్యాపార కేంద్రాలుగా మారిన ప్రైవేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. పాఠశాలలు తెరిచి రోజులవుతున్నా ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించి, నాణ్యమైన భోజనం అందించాలి. అలాగే అన్ని పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలి.శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్టు చేయడం సరికాదని, ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించడం మానుకోవాలని పోలీసులను వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృత్ చారి, యూనివర్సిటీ కార్యదర్శి సమీర్, సునీల్, బాలకృష్ణ, భార్గవ్, రామకృష్ణ, పవన్ తదితరులు పాల్గొన్నారు.
