ముందస్తుగా మురిపించిన మేఘాలు ఆ తర్వాత ముఖం చాటేసాయి. ఆశతో ఖరీఫ్ కోసం సిద్ధపడ్డ రైతులు సీజన్ పై కరువు మేఘాలు కమ్ముకోవడంతో ఆందోళన చెందుతున్నారు. వరినాట్ల కోసం సిద్ధం చేసిన నారుమడి నీరు లేక ఎండిపోయే పరిస్థితి కనిపించడంతో అన్నదాతలు ఆకాశము వైపు కన్నులెత్తి చూస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 4,59,865 ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. గత సంవత్సరం కంటే ఈ ఖరీఫ్ సీజన్ లో 79 వేల ఎకరాలు వరి సాగు విస్తీర్ణం కూడా పెద్ద మొత్తంలో పెరిగింది.
ఖరీఫ్ సీజన్ కు ముందుగానే వర్షాలు రావడంతో వరి రైతుల్లో ఆశలు చిగురించాయి. దీంతో వ్యవసాయ క్షేత్రంలో వరి నారుమడి వేసుకున్న రైతులు, మేఘలు కమ్ముకున్న ఆకాశం వైపు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.
ఓ పక్క వాన చినుకులు రాక.. మరోపక్క బోరు బావుల్లో భూగర్భ జలాలు లేక.. రైతన్న విలవిలలాడుతున్నాడు. ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షపాతం నిజామాబాద్ జిల్లాలో నమోదు కాలేదు.
దీంతో బోరు బావుల మీద ఆధారపడిన రైతులు వరినాట్లు పూర్తి చేసుకున్నారు. వర్షం పై ఆధారపడిన రైతులు చినుకు కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో వర్షపాతం తక్కువ నమోదు కావడంతో బోరు బావులు సైతం నీరును ఎత్తిపోయడం లేదు. ఫలితంగా బోర్లపై ఆధారపడి వేసుకున్న వంటలు సైతం బీటలు బారడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే మరోవైపు కరెంటు కోతలు కూడా ఎక్కువ కావడంతో వరినాళ్ళకు సరిపడా నీరు లేక రైతులు అపసోపాలు పడుతున్నారు.
అప్రకటిత కరెంటు కోతలతో బోర్లు నడవక ఎండిపోయే పరిస్థితి దాపురించిందని రైతులు అంటున్నారు. దీంతో రైతులు వర్షాల కోసం ఆలయాల్లో పూజలు సైతం చేస్తున్నారు .
జూన్ చివర మాసంలో, జూలై మొదటి వారంలో మురిపించిన వర్షాలు ప్రస్తుతం మొఖం చాటేయడంతో, రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు.
