నగరంలోని ఖిల్లా చౌరస్తా వద్ద గల పాత బాల రక్షక భవనంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి, అక్కడ ఉన్న బీరువాలోని కీలక పత్రాలను నిప్పుపెట్టి తగలబెట్టిన ఘటన కలకలం రేపింది.
ఈ ఘటనకు సంబంధించి చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ కేతావత్ బీక్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఐదవ టౌన్ ఎస్ఐ పేర్కొన్న వివరాల ప్రకారం.. దుండగులు భవనంలోకి చొరబడి బీరువాను తెరిచారు.
అందులో భద్రపరిచిన చైల్డ్ వెల్ఫేర్ కు సంబంధించిన పాత ఫైళ్లు, కౌన్సిలింగ్ రికార్డులు, రిజిస్టర్లు వంటి విలువైన పత్రాలను బయటకు తీసి నిప్పుపెట్టారు. ఈ అగ్నిప్రమాదంలో పత్రాలన్నీ పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి.
చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ ఇచ్చిన దరఖాస్తు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ, ఈ దారుణానికి ఒడిగట్టిన అగంతకుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
కార్యాలయంలోని సున్నితమైన పత్రాలు కాలిపోవడం వెనుక ఉన్న అసలు కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
