వర్ని మండలంలోని తగిలేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మైసమ్ వెంకటేష్ అలియాస్ వెంకన్న (55) దారుణ హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బక్క నారాయణ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
మంగళవారం ఉదయం నిందితుడు వర్ని పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. తగిలేపల్లి శివారులోని సర్వే నంబర్ 392లో అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న సుమారు ఎనిమిది ఎకరాల రెవెన్యూ భూమిని వెంకన్న, బక్క నారాయణ సాగు చేసుకుంటున్నారు.
ఇందులో వెంకన్న ఆరు ఎకరాలు, నారాయణ రెండు ఎకరాలు సాగు చేస్తున్నట్లు సమాచారం. తనకు మరో రెండు ఎకరాలు ఇవ్వాలని నారాయణ కొంతకాలంగా వెంకన్నతో వివాదం పడుతున్నట్లు తెలిసింది.ఈ భూమి విషయమై సోమవారం ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అదే రోజు సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో పొలం వద్ద ఇద్దరి మధ్య మరోసారి వివాదం తలెత్తింది. ఈ క్రమంలో బక్క నారాయణ గొడ్డలితో వెంకన్నపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మంగళవారం ఉదయం సుమారు 5.30 గంటలకు నారాయణ వర్ని పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిసింది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
