బాపూజీ వచనాలయంలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో ఎక్కడైనా అవినీతి జరిగినట్లు నిరూపిస్తే రాజీనామాకు తాను సిద్ధంగా ఉన్నానని బాపూజీ వచనాలయం పాలకవర్గం అధ్యక్షుడు భక్తవత్సలం తెలిపారు.
కొందరు తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపించాలని సవాల్ చేశారు.శనివారం వచనాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బాపూజీ వచనాలయాన్ని డిజిటల్ చేయాలనే సంకల్పంతో రూ. 2.5 నుంచి రూ 3 కోట్లతో పనులు జరుపుతున్నామని తెలిపారు. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వచనాలయానికి సంబంధించి అద్దె వసూళ్ల ద్వారా వచ్చిన డబ్బులతో పనులు చేస్తున్నారనీ పేర్కొన్నారు.
ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బకాయిల వసూళ్లకు ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. గతంలో ఉన్న కార్యవర్గం అద్దెదారూల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసి తక్కువ మొత్తం చూపించారని తెలిపారు.
అలాగే గతంలో పెట్రోల్ బంక్ స్థలాలను విక్రయించమని కొందరు తప్పుడు ప్రచారాలు చేశారని తెలిపారు.ఎక్కడైనా అవినీతి జరిగినట్లు నిరూపిస్తే కమిటీ పాలకవర్గ సభ్యులమంతా తక్షణమే రాజీనామా చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాపూజీ వచనాలయ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
