పెట్రోల్, డీజిల్పై భారీగా ఎక్సైజ్ సుంకం తగ్గింపు
డీజిల్పై సుంకం సున్నా.. పెట్రోల్పై రూ. 10 తగ్గింపు
రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదు?:
బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్
శ్రీరామ నవమి పర్వదినం వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు తీపి కబురు అందించారని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ కులాచారి పేర్కొన్నారు.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నా, సామాన్యుడిపై భారం పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకుందని కొనియాడారు.
సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒత్తిడి ఉన్నప్పటికీ, కేంద్రం వెనక్కి తగ్గకుండా ప్రజల సంక్షేమానికే పెద్దపీట వేసిందని దినేష్ పటేల్ తెలిపారు.
ఎక్సైజ్ సుంకాన్ని రూ. 13 నుండి రూ. 3కి తగ్గించి, రూ. 10 మేర వెసులుబాటు కల్పించారు.గతంలో ఉన్న సుంకాన్ని ఏకంగా సున్నా (రూ. 0) కు పరిమితం చేయడం మోదీ గారి జనరంజక పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాపాలు.. మోదీ పరిష్కారాలు
గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అప్పులు, ఆయిల్ బాండ్ల భారం వేల కోట్లు నేటికీ దేశంపై ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు.
ఈ తగ్గింపు వల్ల రవాణా ఖర్చులు తగ్గి, నిత్యావసర వస్తువుల ధరలు అదుపులోకి వస్తాయని, తద్వారా మధ్యతరగతి ప్రజలకు గొప్ప ఊరట లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు
కేంద్రం తన బాధ్యతగా పన్నులు తగ్గించినప్పుడు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని దినేష్ పటేల్ ప్రశ్నించారు.
- పెరుగుతున్న వ్యాట్: 2014లో తెలంగాణలో వ్యాట్ (VAT) 28-30% ఉంటే, నేడు అది ఏకంగా 35% కి చేరిందని విమర్శించారు. దేశంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలవడం దురదృష్టకరమన్నారు.
- కేంద్రం డీజిల్పై సుంకాన్ని సున్నాకు చేర్చినప్పుడు, రాష్ట్రం మాత్రం ఎందుకు అధిక పన్నులతో ప్రజల రక్తాన్ని పిండుతోందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కేంద్రం తన వంతుగా రూ. 10 తగ్గించింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే, తక్షణమే రాష్ట్ర వాటా వ్యాట్ తగ్గించి పెట్రోల్ ధరను రూ. 100 లోపుకు తీసుకురావాలన్నారు.
వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని అడుగులు వేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం అధిక పన్నులతో అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందని ఆయన మండిపడ్డారు.
