- నగరంలో భాజపా నాయకులు కిరాయి మూకలతో దాడులు చేయించడం అప్రజాస్వామికమని నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ విమర్శించారు. భాజపా అక్రమ వసూళ్లను బయటపెట్టినందుకే కక్షగట్టి దాడులకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. కాంగ్రెస్ నాయకుడు జిల్లాల రమేష్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.”ప్రజల ముందుకు నిజాలను తీసుకువస్తే సమాధానం చెప్పలేక దౌర్జన్యాలకు దిగడం భాజపా పిరికిపంద చర్య. ఎనిమిదో డివిజన్ భాజపా కార్పొరేటర్పై రెండు రోజుల క్రితం కేసు నమోదైన విషయం మరువకముందే.. అదే డివిజన్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రమేష్పై దాడి చేయడం కచ్చితంగా కుట్రలో భాగమే” అని రామకృష్ణ పేర్కొన్నారు. విమర్శలను స్వీకరించాల్సింది పోయి భౌతిక దాడులకు దిగడం బాధాకరమన్నారు.ఈ దాడి వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా నిజం దాగదని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని.. సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను చూస్తూ ఊరుకోబోమని, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
