నిజామాబాద్ జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ఇటు నగర ప్రజలు, అటు గ్రామీణ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు.
గత నాలుగు రోజులుగా జిల్లాలో సగటున 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. కాగా, నిన్న (బుధవారం) ఈ సీజన్ లోనే అత్యధికంగా ఏకంగా 46.3 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఇందూరు ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తీవ్రమైన ఎండలు, వడగాల్పుల కారణంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రహదారులన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి.
అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకి రావడానికే జంకుతున్నారు. ఈ పరిస్థితి రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఎండకు భయపడుతూనే పొట్టకూటి కోసం కొందరు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనులకు వెళ్తుండగా, మరికొందరు పనులు లేక ఉపాధి కోల్పోతున్నారు.పగలు ఎండలతో అల్లాడిపోతున్న జిల్లా ప్రజలను సాయంత్రం వేళల్లో వాతావరణంలో వస్తున్న అకస్మాత్తు మార్పులు మరింత బేజారెత్తిస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా సాయంత్రం కాగానే జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.రెండు రోజుల క్రితం నిజామాబాద్ రూరల్ పరిధిలోని గోపాల్ మండలంలో గాలివాన తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది. ఈదురు గాలుల ధాటికి మండలంలోని పలు గ్రామాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి.
రోడ్లకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అలాగే పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడుతున్నాయి.కావున వీలైనంత వరకు ప్రజలు ఇండ్లలోనే ఉండాలని, ఓఆర్ఎస్, మజ్జిగ, నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సాయంత్రం వేళల్లో వచ్చే ఈదురు గాలుల సమయంలో కరెంట్ స్తంభాలు, చెట్ల కింద నిలబడవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
