పిసిసి మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు నీరాజనాలు పలికారని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంత్రుల సమిష్టి కృషితో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 75 శాతానికి పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం శుభపరిణామమని ఆయన కొనియాడారు.
“తెలంగాణ ఓటరు మహాశయులకు శిరస్సు వంచి వందనాలు తెలుపుతున్నాను. మార్పును కోరుకున్న ప్రజలు, మా ప్రభుత్వంపై నమ్మకాన్ని మరోసారి బలపరిచారు” అని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల తీరుపై విమర్శలు గుప్పిస్తూ.. బీఆర్ఎస్, బీజేపీలు ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు వాటిని తిప్పికొట్టారని అన్నారు.
ఆ రెండు పార్టీలు కలిసినా కనీసం 25 శాతం కూడా దాటలేకపోయాయని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో మతం పేరిట రెచ్చగొట్టే రాజకీయాలు చేసే వారికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అద్భుతమైన ఫలితాలు వచ్చాయని వివరించారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తామని, 100కు పైగా అసెంబ్లీ స్థానాలను గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ 75 శాతానికి పైగా స్థానాల్లో జెండా పాతడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. స్పష్టమైన మెజార్టీ అందించి, అభివృద్ధికి తోడ్పాటునందించిన తెలంగాణ ప్రజలకు ఆయన మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.
