ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సమగ్రంగా, పారదర్శకంగా రూపొందించేందుకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)–2026 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించారు.
బూత్ లెవల్ ఆఫీసర్లు, బూత్ లెవల్ ఏజెంట్లకు ఈ నెల 24వ తేదీలోగా శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 25వ తేదీ నుంచి బీఎల్ఓ లు తమ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అక్టోబర్ 1వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురించే వరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, షెడ్యూల్కు అనుగుణంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీ.ఈ.ఓ దృష్టికి తెచ్చారు.
అన్ని స్థాయిల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, జిల్లా స్థాయిలో మూడు దశలలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామని అన్నారు.బూత్ లెవల్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశామని, ఇంటింటి సర్వే సందర్భంగా బి ఎల్ ఓ లు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు ఎస్ఐఆర్ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో ప్రీ మ్యాపింగ్ 87. శాతం పూర్తయ్యిందని తెలిపారు. 1565 పోలింగ్ కేంద్రాల పరిధిలో రాజకీయ పార్టీలు బీ.ఎల్.ఏ ల నియామకాలు పూర్తి చేశాయని, వారికి ఐ.డీ కార్డులు సమకూర్చాల్సిందిగా సూచించామని అన్నారు. కాగా, జిల్లాకు బీ ఎల్ ఓ కిట్లు కేటాయించాలని సీ.ఈ.ఓ ను కోరారు.
వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ భుజంగ రావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, బోధన్ ఆర్డీఓ విజయలక్ష్మి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏఈఆర్ఓలు పాల్గొన్నారు.
