రూ.4 లక్షల విలువైన ఇంజెక్షన్లు, స్కూటీ స్వాధీనం మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా సేకరించి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను చార్మినార్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 100 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ వయల్స్, ఒక యమహా ఏరాక్స్ స్కూటీ, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. టాస్క్ఫోర్స్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆండే శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం..
విశ్వసనీయ సమాచారం మేరకు జులై 29న కమిషనర్ టాస్క్ఫోర్స్ చార్మినార్ జోన్ బృందం సైఫాబాద్ పోలీస్స్టేషన్ సిబ్బందితో కలిసి సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని హెచ్పీ పెట్రోల్ బంకు పక్కన ఉన్న శ్రీ మారుతి లాజిస్టిక్స్ వద్ద దాడులు నిర్వహించింది.
అక్కడ యమహా ఏరాక్స్ స్కూటీపై పెద్ద మొత్తంలో మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను తీసుకెళ్తున్న షేక్ ఫహీమ్ (31), తండ్రి షేక్ లాడ్లేసాబ్, వృత్తి ఎలక్ట్రీషియన్, మహ్మద్ నయీమ్ (35), తండ్రి నాసిర్, వృత్తి కార్ ఎలక్ట్రీషియన్, ఇబ్రహీం హుస్సేన్ (22), తండ్రి దస్తగీర్ హుస్సేన్, వృత్తి విద్యార్థి.. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
వీరంతా తపచపుత్రలోని నటరాజ్నగర్కు చెందినవారని పేర్కొన్నారు. విచారణలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్కు చెందిన శక్తి హుదా అనే వ్యక్తి నుంచి రవాణా ద్వారా ఐపీ–10 ఎంఎల్ మెఫెంటెర్మైన్ సల్ఫేట్ (మెఫ్ప్రో) ఇంజెక్షన్ వయల్స్ను అక్రమంగా కొనుగోలు చేసి, అవసరమైన వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
వారి వద్ద నుంచి 100 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ (మెఫ్ప్రో) 10 ఎంఎల్ ఇంజెక్షన్ వయల్స్, ఒక యమహా ఏరాక్స్ స్కూటీ, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మెఫెంటెర్మైన్ సల్ఫేట్ వైద్యుల సూచన లేకుండా వినియోగిస్తే గుండెపోటు, అధిక రక్తపోటు తదితర తీవ్రమైన హృదయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు.
యువతతో పాటు ప్రజలు ఇటువంటి ఉత్తేజపరిచే మందులను దుర్వినియోగం చేయవద్దని సూచించారు. ఈ ఆపరేషన్ను చార్మినార్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్. సాయిదాబాబు పర్యవేక్షణలో ఎస్ఐలు ఎం. మధు, కె. రామారావు, ఎం. మహేష్, కానిస్టేబుల్ కె. సంతోష్కుమార్, చార్మినార్ జోన్ టాస్క్ఫోర్స్ బృందం, సైఫాబాద్ పోలీస్స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా విజయవంతంగా నిర్వహించారు.
