రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెరపడింది. ప్రభుత్వం-ఆర్టీసీ ఐకాస మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి.
కార్మికుల ప్రధాన డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. కీలక హామీలను ప్రకటించడంతో ఐకాస సమ్మె విరమణకు మొగ్గు చూపింది. శుక్రవారం ఉదయం నుంచి సచివాలయంలో సాగిన మంతనాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి.
అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చర్చల సారాంశాన్ని వెల్లడించారు. చర్చల్లో భాగంగా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 11 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. అలాగే, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక అత్యంత కీలకమైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై అధ్యయనం చేసేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఐకాస నాయకులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.నేటి నుంచే బస్సులుసమ్మె విరమణ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి రోడ్డెక్కాయి. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కార్మికులందరూ తక్షణమే విధుల్లో చేరాలని ఐకాస పిలుపునిచ్చింది.
దీంతో ఆర్టీసీ కార్మికులు తిరిగి ఉద్యోగాల్లో చేరారు. అదేవిధంగా సమ్మె కాలంలో మృతి చెందిన నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.
బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు.. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, నివసించేందుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.ప్రభుత్వ నిర్ణయం పట్ల కార్మిక వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
