నందిపేట మండల కేంద్రంలో బుధవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నియోజకవర్గంలోకి రావద్దంటూ గోడపత్రికలు వెలియడంతో…
విషయం కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది… డొంకేశ్వర్, నందిపేట్ మండలాల బిజెపి శ్రేణులంతా పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడి వాల్ పోస్టర్లను అతికించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు.
ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన మా ఎమ్మెల్యేని రావద్దంటూ దొంగ చాటున ప్రధాన కూడళ్ళు, బస్టాండు, చాయ్ హోటల్లు,వైన్స్ల వద్ద పోస్టర్లు అంటించడం విడ్డూరమని, పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ గొడవలు సృష్టించాలనే గోడ పత్రికలు రాత్రికి రాత్రే అంటించారని, ఇలాంటి వారిపై వెంటనే చర్య తీసుకోవాలని బిజెపి సీనియర్ నాయకులు స్వచ్ఛభారత్ చైర్మన్ ఆదిమూలం వీరేశం అన్నారు.
ఈ జోర్పూర్ రాము అనే వ్యక్తి గతంలో కూడా ఇస్సపల్లి వద్ద ఎంపీ అరవిందు కాన్వాయ్ పై దాడి చేసి మరణాయుధాలతో హంగామా చేసిన సంఘటన అందరికీ తెలుసని, శ్రీ రెడ్డి జీవన్ రెడ్డి పెంచి పోషించిన గంజాయి రౌడీ షీటర్ జోర్పూర్ రాము అని ఘాటుగా విమర్శించారు.
ఇతనిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ కూడా చేశారు. చేతనైతే ప్రభుత్వ అసమర్థత పైన ప్రశ్నించాలి తప్ప ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, మా ఎమ్మెల్యేని ప్రశ్నించిన విధంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లపై ప్రశ్నించే దమ్ము మీకుందా అని సీనియర్ నాయకులు లక్కంపల్లి చిన్నయ్య హెచ్చరించారు.
అలాగే అప్పట్లో చేసిన గంజాయి దందాలకు ఏమైనా మా ఎమ్మెల్యే అడ్డుపడ్డాడా దేనికి మా ఎమ్మెల్యే నియోజకవర్గం రావద్దని పోస్టర్లు అతికించారో ఉద్దేశం తెలపాలని, దొంగ చాటున రాత్రిపూట కాదు ధైర్యంగా అభివృద్ధి పనుల పైన మాట్లాడాలని విమర్శించారు.
సిసి ఫుటేజ్ ఆధారంగా గోడపత్రికలను అంటించిన జోర్పూర్ రాము, మచ్చర్ల విజయ్ సామ్రాట్ను అదుపులోకి తీసుకొని వారి పైన కేసు నమోదు చేశామని ఎస్సై చిరంజీవి తెలపడంతో గొడవ కాస్త సద్దుమణిగింది.
ఈ కార్యక్రమంలో రెండు మండలాల బిజెపి జిల్లా, మండల నాయకులు, భూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
