ప్రేమ వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మాదాపూర్లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
రామేశ్వరం కేఫే సమీపంలో జరిగిన ఈ ఘటనలో భాస్కర్ (30) అనే యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తులు, కర్రలతో దాడి చేయగా, తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే..భాస్కర్ కొంతకాలంగా ఇద్దరు యువతులను వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయమై గతంలో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదుకాగా, ఇరు వర్గాలను పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిసింది.
అయితే ఆ తర్వాత కూడా వివాదం పూర్తిగా సద్దుమణగలేదని సమాచారం.ఇటీవల భాస్కర్ మరోసారి సవాల్ విసిరేలా ప్రవర్తించాడనే సమాచారం పోలీసులకు అందినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన ఓ యువతి తండ్రి, అతడికి పరిచయమైన మరో వ్యక్తితో కలిసి వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చి భాస్కర్పై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దాడి అనంతరం నిందితులిద్దరూ స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. మాదాపూర్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ప్రేమ వేధింపుల వ్యవహారమే హత్యకు దారితీసిందా? లేక మరే ఇతర వ్యక్తిగత విభేదాలు కారణమా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారని, దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
