ఇటీవల వెలువడిన పదవ తరగతి ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన సిరికొండ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల విద్యార్థులను కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు. 582 మార్కులు సాధించిన సుదీప్తినితో పాటు 550 పైన మార్కులు సాధించిన విద్యార్థులు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ను కలిశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందిస్తూ, భవిష్యత్తులో మీరు ఏమి కావాలని కోరుకుంటున్నారని వారి లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదే స్ఫూర్తితో ఉన్నత విద్యను అభ్యసించాలని వారికి హితవు పలికారు. జిల్లాలో107 ప్రభుత్వ పాఠశాలల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యిందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలలు చాలా బాగా నడుస్తున్నాయని, ఉపాధ్యాయులు అంకిత భావంతో బోధన విధులు నిర్వహిస్తున్నారని, పదవ తరగతి ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు ఎంతగానో మెరుగుపర్చిందని అన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కలెక్టర్ విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పిఆర్టియుటిఎస్ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, జెడ్పిహెచ్ఎస్ సిరికొండ గెజిటెడ్ హెచ్.ఎం సతీష్ కుమార్ పాల్గొన్నారు.
