ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపుపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చారిత్రక విజయం సాధించడంపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో స్థానిక భాజపా నాయకులతో కలిసి ఆయన పశ్చిమ బెంగాల్ విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాణసంచా కాల్చి, పార్టీ శ్రేణులు, ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ విచ్చేస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటనకు భువనగిరి జిల్లా నుంచి ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మోదీకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
బెంగాల్లో సాధించిన ఈ విజయంతో దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ నాయకత్వానికి బలం చేకూరిందని, ధర్మం వైపు నిలబడిన బెంగాల్ ఓటర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.వివిధ రాష్ట్రాల్లో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నాయకులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ భాజపా ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, మోదీ అభివృద్ధి పథకాలే పార్టీని గెలిపిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా భాజపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
