పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకున్నారని, మమతా బెనర్జీ అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు బీజేపీ ని గెలిపించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. దేశంలోని మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో సోమవారం నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బెంగాల్ లో బీజేపీ చరిత్ర సృష్టించిందన్నారు. ఊహించిన దానికంటే భారీ సీట్లు కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల ద్వారా ప్రజలు అభివృద్ధిని, పారదర్శకతను, భద్రతను కోరుకుంటున్నారని మరోసారి నిరూపించారన్నారు.
ప్రధానంగా బెంగాల్ ప్రజలు భయం, అవినీతి, అశాంతి పై తిరుగుబాటు చేశారని స్పష్టం చేశారు. మోడీ సారధ్యంలో ప్రజల విశ్వాసాన్ని బెంగాల్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని తెలిపారు. ఈ తీర్పుతో దేశ రాజకీయాలకు కొత్త దిశను చూపుతోందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ మార్పు ఖాయమని స్పష్టం చేశారు. ప్రస్తుత ఫలితాలు చూస్తే ఇది కేవలం ఓటింగ్ కాదని..ప్రజల ఆలోచన విధానం మారుతుందనే సంకేతమన్నారు.
ఇక కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లోనూ ఉనికి కోల్పోయిందని తెలిపారు. అస్సాంలో మరోసారి బీజేపీ కి ప్రజలు పట్టం కట్టారన్నారు. అభివృద్ధి దిశగా ప్రభుత్వాన్ని నడిపిస్తుండటంతో మళ్లీ ఆశీర్వదించారన్నారు. పుదుచ్చేరిలోనూ బిజెపి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారన్నారు.
అనంతరం టపాసులు పేలుస్తూ.. మిఠాయిలు పంచుతూ సంబరాలు జరిపారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, ఫ్లోర్ లీడర్ ప్రమోద్, బిజెపి కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
