ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 122 ఫిర్యాదులు అందాయి.
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్ఓ గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్, డీఆర్డీఓ సాయన్నలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
కాగా, ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.
వేసవి సెలవుల అనంతరం విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం అయిన నేపథ్యంలో మండల ప్రత్యేక అధికారులు, మండల విద్యాధికారులు క్షేత్రస్థాయిలో విధిగా సందర్శిస్తూ సౌకర్యాలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
