భార్య, ముగ్గురు చిన్నారులతో ఆనందంగా గడుపుతున్న ఆ కుటుంబ పెద్ద రెండంతస్తుల భవనంపై నుంచి కింద పడిపోవడంతో వెన్ను విరిగింది. రెండేళ్లుగా మంచానికే పరిమితం కావడంతో ఆ కుటుంబాన్ని పోషించే దిక్కులేక, అటు ప్రభుత్వ సాయం అందక మదనపడుతున్నారు.
పని చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి వీరిది. రెండేళ్లుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఆసరా అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆయన సోమవారం కలెక్టరు రాజీవ్ గాంధీ హనుమంతు కు అర్జీ అందించారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్ నగరం పవన్నగర్ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. పవన్ డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన సుప్రియను 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె గృహిణి. వీరికి ప్రణయ్, ప్రదీప్, కుమార్తె ప్రసన్న ముగ్గురు పిల్లలు ఉన్నారు.
రోజు కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు.2022 జూన్ లో రెండో అంతస్తులో గోడలకు రంగులు వేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి వెన్నెముక విరిగి, నరం దెబ్బతిని నడుం కింది భాగం నుంచి పాదాల వరకు స్పర్శ కోల్పోయి మంచానికే పరిమితమయ్యారు.
దీంతో రెండేళ్లుగా భార్యే కూలి పనులు చేస్తూ భర్త బాగోగులు చూసుకుంటుందనీ తెలిపారు.కుటుంబ పోషణ భారం కావడంతో పిల్లల్ని పస్తులుంచాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సదరం శిబిరంలో పరిశీలించి ప్రభుత్వ వైద్యులు 90శాతం అంగవైకల్యం ఉన్నట్లు తేల్చి 2022లో ధ్రువపత్రం జారీ చేశారు.
గతంలో కూడా పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని,అయిన పింఛను మంజూరు కాలేదని తెలిపారు. ప్రభుత్వం దయదలిచి రెండు పడకగదుల ఇంటితో పాటు ఆసరా పింఛను అందేలా చూడాలని వేడుకుంటున్నారు.
