నలుగురికి గాయాలు..రోడ్డు దాటుతున్న ఓ కారును ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఒకరు మృత్యువాత పడ్డారు.మిగతా నలుగురికి గాయాలు అయ్యాయి.
ఈ ఘటన నగర శివారులోని దాస్ నగర్ లో చోటు చేసుకుంది.మాక్లూర్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం..
శనివారం మాక్లూర్ గ్రామానికి చెందిన షేక్ సోహెల్ అతని కుటుంబ సభ్యులైన అమ్మ మహమ్మదీ, వదిన సాదియా, ఆమె ఇద్దరు చిన్నపిల్లలతో పాటు కారులో ఆసుపత్రికి వెళుతుండగా మార్గమధ్యలో దాస్ నగర్ టీ జంక్షన్ వద్ద నిజామాబాద్ వైపు రోడ్డు క్రాస్ చేసే సమయంలో అటువైపుగా నిజామాబాద్ వైపు నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న ఆర్టిసి ఎలక్ట్రికల్ బస్సు అతివేగంగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టినట్లు తెలిపారు.
దీంతో కార్లో ఉన్న మహమ్మదీ తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. అలాగే కారు నడుపుతున్న షేక్ సోహెల్, వారి కుటుంబ సభ్యులకు కూడా గాయాలైనట్లు తెలిపారు.
ప్రస్తుతం వారు నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు మృతురాలి భర్త షేక్ అహ్మద్ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.
