ఆర్మూర్:
కాంగ్రెస్ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో చేరవేసేందుకు, స్థానిక సమస్యల మీద ప్రతిస్పందించేందుకు చేపట్టిన పాదయాత్ర నేడు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో కొనసాగనుంది.
ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కాంగ్రెస్ మీనాక్షి నటరాజన్ తో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, కార్పొరేషన్ చైర్మన్లు రాష్ట్రస్థాయి కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు.
ఇందుకోసం ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ కార్యకర్తలను పెద్ద ఎత్తున తరలించేందుకు బాల్కొండలో ముత్యాల సునీల్ కుమార్, ఆర్మూర్ లో వినయ్ రెడ్డిలు క్యాడర్ ను సమయత్తం చేశారు.
ఇంతవరకు బాగానే ఉన్నా… కాంగ్రెస్ హై కమాండ్ చేపడుతున్న ఈ పాదయాత్ర ఎంతవరకు హస్తం శ్రేణుల్లో జోష్ ను నింపుతుందో అని పలువురు అంటున్నారు. ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లా మేఘం వాసులు రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లా పరిషత్ ను గులాబీ ఖాతాలో వేశారు. అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం తొమ్మిది నియోజకవర్గాల్లో గులాబీ పార్టీకి పట్టం కట్టారు. రెండు పర్యాయాలు కారు జోరుకు కళ్లెం వేయలేక ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ బిజెపి లు చతికిలబడ్డాయి.
అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడు లేనట్టుగా జిల్లా ఓటర్లు విలక్షణమైన తీర్పులు ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, బాల్కొండ , బోధన్ నియోజకవర్గాలు ఉండగా… బోధన్ లో సుదర్శన్ రెడ్డి, రూరల్ నియోజకవర్గం లో భూపతి రెడ్డిలకు మొగ్గు చూపి హస్తగతం చేశారు.
నిజామాబాద్, ఆర్మూర్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థులైన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా , పైడి రాకేష్ రెడ్డిలు విజయ కేతనం ఎగురవేశారు. అయితే బాల్కొండలో బిఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి తన ఆదిక్యాన్ని చాటుకున్నారు. ఇలా జిల్లా ఓటర్లు ఇచ్చిన విలక్షణమైన తీర్పు ఓ దశలో రాజకీయ విశ్లేషకులకు సైతం నివ్వెరపరిచింది.
అయితే వైయస్ ప్రభుత్వ హాయంలో కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపిన జిల్లా వాసులు, ఆశించిన స్థాయిలో ఆదరించలేకపోయారు.
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్నప్పటికిని వాటిని ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్ నాయకులు విఫలమైనట్టు భావిస్తున్నారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు సర్కార్ సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లకపోతే రానున్న స్థానిక ఎన్నికల్లో పరాభవం చూడక తప్పదు. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు మీనాక్షి నటరాజన్ చేపడుతున్న పాదయాత్ర ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే..!
