నిజామాబాద్ నగరంలోని సుభాష్నగర్ బాలసదన్ నుంచి అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఉదంతం ఎట్టకేలకు సుఖాంతమైంది. గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన ఈ ఘటనలో పోలీసులు, సి.డబ్ల్యూ.సి అధికారులు సమన్వయంతో వ్యవహరించి చిన్నారులను సురక్షితంగా వారి కుటుంబాల చెంతకు చేర్చారు.
ఈ నెల 12వ తేదీన బాలసదన్లో నివసిస్తున్న 14, 9 సంవత్సరాల వయసున్న ముగ్గురు అమ్మాయిలు వార్డెన్కు చెప్పకుండా బయటకు వెళ్ళిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న నిజామాబాద్ 3వ టౌన్ ఎస్.ఐ హరిబాబు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చిన్నారుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. విచారణలో భాగంగా చిన్నారుల స్వగ్రామాల్లో వెతకగా, ఇద్దరు అమ్మాయిలు వారి ఇంటి వద్దే ఉన్నట్లు గుర్తించి, వారిని తిరిగి బాలసదన్కు తరలించారు. 9 ఏళ్ల మరో చిన్నారి అడ్రస్ సరిగ్గా లేకపోవడంతో గాలింపు కొనసాగించారు.
బుధవారం రాత్రి ప్రాంతంలో ఆ చిన్నారి కూడా తన తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులపై ఉన్న ప్రేమ, ఇంటిపై ఉన్న బెంగతోనే తాము బాలసదన్ నుండి వెళ్ళిపోయినట్లు చిన్నారులు తెలిపారని ఎస్.ఐ హరిబాబు పేర్కొన్నారు.
ముగ్గురు చిన్నారులు క్షేమంగా దొరకడంతో అటు పోలీసులు, ఇటు బాలసదన్ సిబ్బందితో పాటు స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. పిల్లల భద్రత విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాం. చిన్నారులు క్షేమంగా వారి తల్లిదండ్రుల చెంతకు చేరడం సంతోషకరం అని మూడవ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు.
