రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి (కలెక్టరేట్)కు శనివారం విచ్చేసిన బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డిని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికాయి.
రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణాలు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కలెక్టరేట్ లో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ్ రెడ్డి నేతృత్వంలో ఆ సంఘం ప్రతినిధులు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి స్వాగతం పలికారు. పూల మొక్కలు అందించి శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.
రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు సమర్ధవంతంగా సేవలు అందించాలని ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి సూచించారు. కాగా, టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు సుమన్ ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ప్రశాంత్, శ్రీనివాస్, ప్రభు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
