స్థానిక సంస్థల ఎన్నికల పండుగ జోరుగా సాగుతున్న తరుణంలో, నిజామాబాద్ జిల్లా, బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని పోతంగల్ మండలంలో అసాధారణ పరిణామం తెరపైకి వచ్చింది.
తొలిదశ ఎన్నికల నామినేషన్ల ముగిసేనాటికి, పొతంగల్ మండలంలోని జల్లపల్లి ఫారం, పోతంగల్ గ్రామ పంచాయతీ స్థానాలకు, అలాగే వార్డు మెంబర్ స్థానాలకు ఏ ఒక్క గ్రామస్థుడు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. ప్రజాస్వామ్య ప్రక్రియపై గ్రామస్థులు బహిరంగంగా ప్రదర్శించిన ఈ తీవ్ర విముఖత జిల్లా యంత్రాంగాన్ని నిర్ఘాంతపరిచింది.
సాధారణంగా నామినేషన్ల సందర్భంగా కనిపించే హడావుడి, రాజకీయ వేడి ఈ రెండు గ్రామాల్లో ఏమాత్రం లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారి గ్రామానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం, అపరిష్కృతంగా ఉన్న స్థానిక సమస్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేయడానికి గ్రామస్థులు ఏకమై ఎన్నికలను బహిష్కరించి ఉంటారనే వాదన బలంగా వినిపిస్తోంది.
