రెండవ విడత ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని ఇందల్ వాయ్, ధర్పల్లి మండలాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ సరళిని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య ఆదివారం పరిశీలించారు.
ఇందులో భాగంగా ఇందల్ వాయ్, ధర్పల్లి మండలాల పరిధిలోని తిర్మన్ పల్లి, రామడుగు గ్రామాలలోని జిల్లా పరిషత్ హై స్కూల్ పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను, భద్రతా చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు.
సీపీ సాయి చైతన్య సంబంధిత అధికారులతో మాట్లాడుతూ, ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని ఆదేశించారు.
విధుల్లో ఉన్న సిబ్బంది మరియు అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అదేవిధంగా, ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ తనిఖీ సందర్భంగా ఎస్.ఐ. సామ శ్రీనివాస్, ఎస్.ఐ. హరి బాబు, ఆర్.వో. అధికారులు గంగయ్య, శ్రీనివాస్, జిలాని తదితరులున్నారు.
