Saturday, April 18, 2026
HomeCRIMEనిజామాబాద్ ధర్మారంలో రణరంగం: పోలింగ్ కేంద్రం వద్ద వర్గాల ఘర్షణ - అభ్యర్థి ప్రచారంతో మొదలైన...

నిజామాబాద్ ధర్మారంలో రణరంగం: పోలింగ్ కేంద్రం వద్ద వర్గాల ఘర్షణ – అభ్యర్థి ప్రచారంతో మొదలైన రచ్చ!

నిజామాబాద్ జిల్లా, ధర్మారం గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా చెలరేగిన వర్గ విభేదాలు చిలికిచిలికి గాలివానగా మారి, బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణకు దారితీశాయి.

పోలింగ్ కేంద్రం రణరంగంగా మారడంతో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ధర్మారం పోలింగ్ బూత్ పరిధిలో సర్పంచ్ అభ్యర్థి సాయిబాబా ప్రచారం చేస్తున్నారని ప్రత్యర్థి వర్గం తీవ్రంగా ఆరోపించింది.

ఏకంగా పోలింగ్ కేంద్రంలోనే ‘రింగింగ్’కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీంతో.. సాయిబాబా అభ్యర్థిత్వంపై ప్రత్యర్థి వర్గం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది.

పరిస్థితి అదుపుతప్పుతుండగానే, మరో అభ్యర్థి వాసు వర్గానికి చెందిన కార్యకర్తలు ఏకంగా పోలింగ్ సెంటర్ లోకి దూసుకొచ్చారు.

ఇది కాస్తా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వర్గాల ఘర్షణకు దారితీసింది. వర్గాల ఘర్షణతో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ… గ్రామస్తులు, ముఖ్యంగా ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు పోలీసుల తీరును నిరసిస్తూ పోలింగ్ కేంద్రం ఎదుటే బైఠాయించి ధర్నాకు దిగారు.

క్షేత్రస్థాయిలో పరిస్థితి చేయిదాటిపోతుండటంతో అదనపు బలగాలను రప్పించారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి, ఉద్రిక్తతను నియంత్రించేందుకు లాఠీలకు పనిచెప్పినట్లు సమాచారం.

సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ధర్మారంలో నెలకొన్న ఈ ఘర్షణ, పోలింగ్ పవిత్రతపై నీలినీడలు కమ్మింది. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందేహాన్ని గ్రామ ప్రజల్లో రేకెత్తిస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!