బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను నందిపేట్ మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు, మండల పార్టీ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా స్థానిక పలుగుట్ట కేదారేశ్వర ఆలయంలో నాయకులు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులోనూ రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేసేలా ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
గతంలో ఐటీ శాఖా మంత్రిగా తెలంగాణను ప్రపంచస్థాయిలో నిలిపిన ఘనత ఆయనదేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు పడుతున్న కష్టాలను నాయకులు ప్రస్తావించారు. నందిపేట్ మండలంలో గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా తక్షణమే సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కేటీఆర్తో కలిసి నేరుగా నందిపేట్ మండలానికి వచ్చి గుత్ప పంపులను ఆన్ చేసి నీటిని విడుదల చేస్తామని హెచ్చరించారు. జన్మదిన వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
అనంతరం స్థానిక ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. వివిధ ఆసుపత్రులను సందర్శించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
