జిల్లాలోని కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలు మితిమీరుతున్నాయి. వచ్చే 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభానికి ఇంకా నెలల సమయం ఉండగానే, అప్పుడే అడ్మిషన్ల వేట మొదలుపెట్టడంపై జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, కేవలం లాభార్జనే ధ్యేయంగా విచ్చలవిడి ప్రచారాలు చేస్తున్న పాఠశాలలకు ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. విద్యా శాఖ నిబంధనల ప్రకారం అడ్మిషన్ల ప్రక్రియకు నిర్దిష్ట సమయం ఉంటుంది.
కానీ, జిల్లాలోని పలు పాఠశాలలు ఇవేమీ పట్టించుకోకుండా ఇప్పుడే ‘అడ్మిషన్లు ప్రారంభం’ అంటూ ఫ్లెక్సీలు, హోర్డింగులతో హంగామా చేస్తున్నాయి. అడ్మిషన్ల పేరిట తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ ముందస్తు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
దీంతో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలను తుంగలో తొక్కి అడ్మిషన్ల దందా చేస్తున్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పుడే ఫ్లెక్సీలు పెట్టడం విడ్డూరంగా ఉంది. అక్రమ అడ్మిషన్ల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి. లేనిపక్షంలో ఎటువంటి ముందస్తు సమాచారం, నోటీసులు లేకుండానే ఆ పాఠశాలల గుర్తింపును రద్దు చేయడమే కాకుండా, కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా అక్రమ అడ్మిషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఈవో తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన ప్రచార బోర్డులను తక్షణమే తొలగించాలి.
అడ్మిషన్ల పేరుతో అదనపు ఫీజులు వసూలు చేస్తే సహించే ప్రసక్తే లేదనీ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలకు రెండో అవకాశం ఇచ్చేది లేదని, నేరుగా మూసివేత ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.
విద్యను వ్యాపారంగా మార్చి, తల్లిదండ్రుల బలహీనతతో ఆడుకునే యాజమాన్యాల ఆటలు ఇక సాగవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రతి ప్రైవేట్ పాఠశాల నిబంధనలకు లోబడి పని చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.
