వికసిత్ భారత్ – వికసిత గ్రామాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘వికసిత్ భారత్ – రోజ్ గార్ ఔర్ అజీవిక మిషన్’ చట్టం గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చబోతోందని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి పేర్కొన్నారు.
గురువారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ఉపాధిని బలోపేతం చేస్తూ, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రధాని మోదీ ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.
గతంలో అమల్లో ఉన్న ఉపాధి హామీ పథకం కింద కేవలం 100 రోజులు మాత్రమే పని కల్పించేవారని, కానీ నూతన చట్టం ద్వారా ఆ పరిమితిని 125 రోజులకు పెంచినట్లు ఆయన వివరించారు. ఈ చట్టంపై ప్రతిపక్ష కాంగ్రెస్ అనవసరపు గందరగోళం సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు.
“పని కోరిన 15 రోజుల్లోగా ఉపాధి కల్పించకపోతే తప్పనిసరిగా నిరుద్యోగ భృతి చెల్లించే నిబంధనను ఈ చట్టంలో మరింత బలోపేతం చేశాం” అని ఆయన స్పష్టం చేశారు. కూలీలకు వేతనాల చెల్లింపులో జాప్యం లేకుండా ప్రతి వారం నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తామని తెలిపారు.
ఒకవేళ నిర్ణీత సమయంలోగా వేతనం చెల్లించకపోతే, బాధితులకు అదనపు పరిహారం చెల్లించే వెసులుబాటు కూడా ఈ చట్టంలో ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ సీజన్లలో కూలీల కొరత తలెత్తకుండా, విత్తులు, నాట్లు, కోత సమయాల్లో 60 రోజుల పాటు ఉపాధి పనులకు విరామం ఇచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించినట్లు వివరించారు.
గ్రామసభలే ప్రణాళికా కర్తలుగ్రామ పంచాయతీలు, గ్రామసభలే స్వయంగా తమ గ్రామాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకునే స్వేచ్ఛను ఈ చట్టం కల్పిస్తోందన్నారు. ముఖ్యంగా చెరువులు, చెక్ డ్యామ్ల నిర్మాణం. పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు, కాలువల వంటి మౌలిక సదుపాయాలు స్వయం సహాయక బృందాల ఆదాయ పెంపునకు ప్రాధాన్యం.
అక్రమాలకు తావులేకుండా ఆధార్, బయోమెట్రిక్ అనుసంధానంతో నిధుల పంపిణీ జరుగుతుందని దినేష్ పటేల్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్కార్ లక్ష్మీనారాయణ, నగ్గొల్ల లక్ష్మీనారాయణ, నాయకులు ప్రమోద్, జ్యోతి, బద్దం కిసాన్ తదితరులు పాల్గొన్నారు..
