యువత క్రీడల వైపు మళ్లాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పిలుపునిచ్చారు. శనివారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ప్రీమియర్ లీగ్’ గోడపత్రికను ఆవిష్కరించి, భారీ క్రీడా ర్యాలీని ఆయన ప్రారంభించారు.
స్థానిక డీఎస్ఏ మైదానం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పాత కలెక్టరేట్, కోర్టు చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం, ఎన్టీఆర్ చౌరస్తా, విజయ్ థియేటర్, రైల్వే కమాన్ మీదుగా పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు ఉత్సాహంగా సాగింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. జిల్లా నుంచి ఎంతోమంది జాతీయ స్థాయి క్రీడాకారులు రావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ లీగ్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్ వంటి క్రీడలతో పాటు యోగాను కూడా చేర్చినట్లు తెలిపారు. యువత పెడదోవ పట్టకుండా ఉండేందుకే ఈ సమ్మర్ క్యాంప్లు, లీగ్స్ నిర్వహిస్తున్నామని వివరించారు.
ముఖ్యంగా డ్రగ్స్, సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ.. సే నో టు డ్రగ్స్ – సే ఎస్ టు స్పోర్ట్స్ అని నినదించారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల సీపీ ఆందోళన వ్యక్తం చేశారు. “2025 సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల 300 మంది ప్రాణాలు కోల్పోయారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తేనే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటారు” అని ఆయన హితవు పలికారు.
అనంతరం సీపీ క్రీడా జ్యోతిని వెలిగించి ర్యాలీని ముందుకు నడిపించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ బస్వా రెడ్డి, ఎన్ఎస్సీ జనరల్ సెక్రెటరీ కవితా రెడ్డి, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ రజనీకాంత్, ట్రెజరర్ సంతోష్, ప్రతినిధులు శిరీష్, పితాని, శివప్రసాద్, గణేష్ గుప్తా, పీఈటీలు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
