నిత్యం ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో దొంగలు పంజా విసురుతున్నారు. పట్టపగలే ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు.
తాజాగా జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న చైన్ స్నాచింగ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కేశాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఆదివారం ఉదయం తన పొలం పనులకు వెళ్లింది.
పనులు ముగించుకుని మధ్యాహ్నం సమయంలో కేశాపూర్ నుంచి సికింద్రాపూర్ వైపు కాలినడకన ఇంటికి వెళ్తోంది. సరిగ్గా అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వెనుక నుంచి వెంబడించిన ఓ గుర్తు తెలియని దుండగుడు..
ఆమెకు తేరుకునే లోపే మెడలోని తులంన్నర బంగారు గొలుసును బలంగా తెంచుకుని క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో సదరు మహిళ బిత్తరపోయింది. ఆమె కేకలు వేసేలోపే నిందితుడు వేగంగా బైక్పై వెళ్లిపోయాడు.
బాధితురాలు వెంటనే స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న జక్రాన్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
నిందితుడు వెళ్లిన మార్గంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పట్టపగలే ఈ తరహా దొంగతనం జరగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
