తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ నగరం గులాబీమయమైంది.
మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీతో నగరం హోరెత్తింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని కేడర్లో ఉత్సాహాన్ని నింపారు. కేసీఆర్ నివాసానికి నోటీసులు అతికించడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీలో సుమారు 1500 బైక్లతో కార్యకర్తలు నల్లజెండాలు ఊపుతూ తరలివచ్చారు. ఎల్లమ్మగుట్ట చౌరస్తా, నిఖిల్ సాయి చౌరస్తా, పూలాంగ్, రాజ రాజేంద్ర చౌరస్తా, గాంధీ చౌక్, పాత కలెక్టరేట్ మీదుగా పార్టీ కార్యాలయం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది.
ఎల్లమ్మగుట్ట చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకుని వ్యాన్లోకి ఎక్కించే క్రమంలో నాయకులకు, పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు కీలక నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు.
స్టేషన్లో కార్యకర్తలకు భరోసా
అరెస్ట్ వార్త తెలుసుకున్న గణేష్ బిగాల, వేముల ప్రశాంత్ రెడ్డి అరెస్టయిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. “కార్యకర్తలకు అండగా మేమున్నాం.. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు” అంటూ వారు ధైర్యం చెప్పారు.
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసీఆర్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని నేతలు హెచ్చరించారు.
