“రాజకీయం నాకు వ్యాపారం కాదు.. అదొక సామాజిక బాధ్యత. పదవుల కోసం కాకుండా, ప్రజల కష్టాలను తీర్చే సేవకురాలిగా మీ ముందుకు వస్తున్నాను” అని 49వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిని బాత్ నాత్ శాలిని శ్రీరాంమనిష్ ప్రకటించారు.
డివిజన్ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా తన కార్యాచరణను ఆమె ప్రజల ముందుంచారు. డివిజన్ లోని నర్సాగౌడ్ హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేయడం. డివిజన్ వ్యాప్తంగా అధ్వాన్నంగా ఉన్న రహదారుల స్థానంలో నూతన బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం. ప్రతి ఇంటికీ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, స్వచ్ఛమైన శుద్ధి చేసిన తాగునీటి సరఫరా.
క్రమం తప్పకుండా ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ. ప్రజల రక్షణ కోసం కాలనీల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, ప్రతి వీధిలో పూర్తిస్థాయి విద్యుత్ దీపాల అమరిక. నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు ప్రత్యేకంగా ‘నైపుణ్యాభివృద్ధి కేంద్రం’ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
సొంత భూమిలో మీరు చేపట్టే ఏ నిర్మాణానికైనా గత కార్పొరేటర్ల మాదిరిగా నేను డబ్బులు వసూలు చేయను. ఒక్క రూపాయి కూడా అడగకుండా పూర్తి సహకారం అందిస్తాను” అని స్పష్టం చేశారు.పాలన అనేది నమ్మకంపై ఆధారపడి ఉండాలి కానీ, డబ్బులపై కాదు.
నేను ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ఈ డివిజన్ అభివృద్ధి కోసం నా సేవ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందనీ స్పష్టం చేశారు.
