మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు.
మంగళవారం జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి నిర్వహించిన దిశానిర్దేశం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. “ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, బంధుప్రీతికి తావివ్వకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలి.
ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి” అని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏ చిన్న సమాచారం తెలిసినా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.
భారీ బందోబస్తు ఏర్పాట్లు ఎన్నికల బందోబస్తు కోసం కేవలం జిల్లా పోలీసులే కాకుండా, టీఎస్ఎస్పీ, ప్లాటూన్లు, ఎక్సైజ్, అటవీ శాఖల సిబ్బందిని కూడా వినియోగిస్తున్నట్లు తెలిపారు. వీరితో పాటు ఎన్.సి.సి క్యాడెట్లు కూడా విధుల్లో పాలుపంచుకోనున్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి, నిజామాబాద్ ఏసీపీ బి. ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సీఐడీ ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, రామకృష్ణతో పాటు పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
