ప్రభుత్వ వైద్య కళాశాల స్థాపించి పదమూడేళ్లు గడిచినా.. వందల మంది వైద్యులు పట్టభద్రులై బయటకు వెళ్తున్నా.. ఆ ప్రభుత్వ వైద్య కళాశాల తలరాత మాత్రం మారడం లేదు.
విద్యార్థుల శారీరక దృఢత్వానికి, క్రీడా వికాసానికి అత్యంత కీలకమైన ‘శాశ్వత మైదానం’ కేటాయింపులో పాలకులు, అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది.
దశాబ్ద కాలానికి పైగా వినతులు ఇస్తున్నా పట్టించుకోకపోవడంతో, విసిగిపోయిన జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (జుడా) బుధవారం (ఫిబ్రవరి 25) నుంచి పోరాట బాట పట్టాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా వారు ఓ ప్రకటన విడుదల చేశారు.
వైద్య విద్య అంటే కేవలం పుస్తకాలు, ఆపరేషన్ థియేటర్లే కాదు.. విద్యార్థుల మానసిక ఉల్లాసానికి క్రీడలు కూడా అంతే ముఖ్యం. కానీ, ఈ కళాశాలలో మైదానం లేకపోవడం వల్ల క్రీడా పోటీలు, సంస్థాగత సమావేశాల నిర్వహణ గగనమైపోతోందనీ వారు ఆవేదన వ్యక్తంచేశారు. గత 13 ఏళ్లుగా మైదానం కోసం భూమి కేటాయిస్తామని అధికారులు చెబుతున్నా, ఆచరణలో అడుగు ముందుకు పడలేదనీ తెలిపారు.
ప్రాథమిక మౌలిక సదుపాయాలను కూడా కల్పించకపోవడం విద్యార్థుల సంక్షేమం పట్ల అధికారులకు ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది.తేల్చుకుంటాం.. ‘నల్ల’ నిరసనతో హెచ్చరికపదేపదే అభ్యర్థించినా స్పందన లేకపోవడంతో, శాంతియుత నిరసన ద్వారా తమ నిరసనను గొంతెత్తి చాటాలని జుడాలు నిర్ణయించారు. ఇందులో భాగంగా నేటి నుంచి విధుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేయనున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి మైదానానికి భూమి కేటాయించకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని జుడా ప్రతినిధులు హెచ్చరించారు. ప్రభుత్వ యంత్రాంగం ఇకనైనా తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
