బోధన్ ఎమ్మెల్యే , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగ మోహన్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
నిజామాబాద్లోని సుదర్శన్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీలో ఆసుపత్రికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగ మోహన్, సుదర్శన్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిగా వేలాది మందికి సేవలందిస్తున్న జీజీహెచ్ను మరింత అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంలో రాజీ పడకూడదని సూచించారు. ఆసుపత్రి అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, ప్రభుత్వం ద్వారా అవసరమైన నిధులు, వసతులు సమకూరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
