యువత, క్రీడాకారులు వేసవిలో చెడు అలవాట్ల బారిన పడకుండా నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మంచి కార్యక్రమాన్ని చేపట్టిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.
నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆయా క్రీడాంశాల్లో ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చొరవతో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.
కేవలం పోలీసులే కాకుండా సేవా భావం కలిగిన ప్రముఖులను కౌన్సిల్లో చోటు కల్పించి ముందుకు సాగడం మంచి పరిణామం అన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒక క్రీడాంశాల్లో శిక్షణ తీసుకోవాలన్నారు.
నిజామాబాద్ లో సింథటిక్ ట్రాక్ తో కూడిన స్టేడియం నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. గత సంవత్సరమే హామీ ఇచ్చినా ..ఇప్పటివరకు నిర్మాణం ప్రారంభం కాలేదన్నారు.
స్టేడియం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అందేలా తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. శిక్షకులు లేకున్నా, పూర్తి సౌకర్యాలతో స్టేడియం లేకున్నా అనేక క్రీడాంశాల్లో జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు.
కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మేయర్ ఉమారాణి, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అడిషనల్ డిసిపి శుభం ప్రకాష్, కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కవిత రెడ్డి, సంయుక్త కార్యదర్శలు రజనీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ ఉష తదితరులు పాల్గొన్నారు.
